
మహేష్బాబు నటించిన సర్కారు వారి పాట డివైడ్ టాక్ను సొంతం చేసుకున్నా పోటీ సినిమాలు లేకపోవడంతో మంచి కలెక్షన్లను రాబట్టింది. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, జీఎంబీ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తొలివారం ఈ మూవీ ఏపీ, తెలంగాణలో కలిపి రూ.82 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 7 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లో 11 కోట్లకుపైగానే రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్ల షేర్ సాధించింది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో కళావతి సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది. పెన్నీ సాంగ్, మ మ మహేషా సాంగ్స్ కూడా ఆదరణ పొందాయి.
మరోవైపు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F3 మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఈ నెల 27న విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆద్యంతం కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. ఈ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఒకప్పటి జంధ్యాలను గుర్తుకు తెచ్చారని అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అలీ, సునీల్, అన్నపూర్ణమ్మ, వై.విజయ క్యారెక్టర్లు కూడా ప్రేక్షకులను నవ్వించాయి. ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించగా అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్లో పూజా హెగ్డే కూడా కనిపించింది. విడుదలైన తొలిరోజే ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో తొలివారం ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో రూ.53 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. కొన్ని ఏరియాలలో మహేష్బాబు సర్కారు వారిపాట సినిమా కంటే F3 మూవీ ఎక్కువ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.
కాగా F3 మూవీ ఓటీటీ అప్డేట్ను కూడా ఇటీవల చిత్ర యూనిట్ ఓ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో ప్రత్యక్షమవుతుంది. ఇక పాన్ ఇండియా మూవీలు.. లేక ఎక్కువ వసూళ్లు రాబట్టే మూవీలు మాత్రమే ఓటీటీలోకి రావడానికి కొద్దిగా ఆలస్యమవుతాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందుతుందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం ఓటీటీలో నాలుగు వారాలకు కాకుండా 8 వారాలకు అడుగుపెడుతున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని హీరోలు వెంకీ, వరుణ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక వీడియో ద్వారా తెలిపారు. 8 వారాల తరువాతే ఎఫ్3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని.. అప్పటివరకు కూర్చోకుండా థియేటర్కు వెళ్లి ఫన్ ఫుల్ సినిమాను ఎంజాయ్ చేయాలని తెలిపారు. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశపడుతున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సోనీ లివ్, శాటిలైట్ హక్కులను జీతెలుగు ఛానల్ దక్కించుకున్నాయి.