
దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్టు 1 శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైంది. తమిళ బాహుబలి సినిమాగా దీనిని సినీ విశ్లేషకులు భావించారు. మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. తమిళనాడులో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా మిగతా రాష్ట్రాల్లో మాత్రం నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. చోళుల నేపథ్య కథ ఆధారంగా ఈ మూవీని మణిరత్నం తెరకెక్కించారు. తమిళనాడులో విపరీతంగా అమ్ముడుపోయిన నవల పొన్నియిన్ సెల్వన్. చోళ చక్రవర్తి, రాజ రాజ చోళుడు-1 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను మేళవించి కల్కి కృష్ణమూర్తి ఈ నవలను రాశారు. అయితే నవలను మణిరత్నం సరైన స్థాయిలో తెరకెక్కించలేదనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా మణిరత్నం మార్క్ ఈ మూవీలో కనిపించకపోగా కథనం చాలా నెమ్మదిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. తమిళ విమర్శకులు మాత్రం పొన్నియిన్ సెల్వన్ పార్టు-1 సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 70 ఏళ్లుగా ఎంతో మంది ఈ సినిమాను తీద్దామని ప్రయత్నాలు చేశారని.. ఆఖరికి మణిరత్నం సాధించారని కొనియాడుతున్నారు. అయితే ఏపీ, తెలంగాణలో మాత్రం టాక్ డిఫరెంట్గా ఉంది. యాక్షన్, అడ్వంచర్ ఊహించిన స్థాయిలో లేవని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాహుబలి సినిమాను చూసిన కళ్లతో ఈ సినిమాను చూడలేకపోతున్నారు. రాజుల కథలు, రాజ్యాల గాథలు, సింహాసనం కోసం వేసే ఎత్తుగడలు, వాటి కోసం పన్నేకుట్రలు, వెన్ను పోట్లు, యుద్ధ నీతి.. ఇవన్నీ చందమామ కథల్లోనే కాదు, చరిత్రలోనూ ఉన్నాయి. వాటిని పట్టుకోవడం అందరికీ చేత కాదు. రాజమౌళికి మాత్రం ఇలాంటి కథలు కొట్టిన పిండి. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే దిశగా మణిరత్నం పూర్తిగా సఫలం కాలేదనే విమర్శలు ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కాగా భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.60కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కార్తి, విక్రమ్, జయం రవి, ఐశ్వర్య, త్రిష వంటి హేమాహేమీలు బాగా నటించారని.. అయితే కథ, కథనాలు ఆకట్టుకునేలా లేకపోవడంతోనే ఈ సినిమా అనుకున్నస్థాయిలో లేదని బాక్సాఫీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కానీ తమిళ విమర్శకులు బాహుబలి లాంటి కల్పిత కథలతో ఈ సినిమాను పోల్చడం సరికాదని హితవు పలుకుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీకి దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ చిత్రం నైజాంలో రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది. సీడెడ్లో రూ. 2 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్లో రూ. 4.5 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది. ఓవరాల్గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. పొన్నియన్ సెల్వన్ పార్టు-1 హిట్ అనిపించుకోవాలంటే ఈ సినిమా రూ. 10.50 కోట్ల షేర్ రాబడితే హిట్ అనిపించుకుంటుంది.