
ఇటీవల కాలంలో సరైన హిట్ లేక బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతం అవుతోంది. ఏ సినిమా విడుదలైనా ఫ్లాప్ అవుతుండటంతో బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అమీర్ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా డిజాస్టర్ కావడంతో పెద్ద దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంట నటించడం, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమాపై హైప్ పెరిగింది. మూడు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కోసం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టారు. తెలుగులో రాజమౌళి సమర్పించడంతో సినిమా మార్కెటింగ్ బాగా జరిగింది. మరోవైపు ఈ మూవీని త్రీడీ, ఐమ్యాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్లలో కూడా విడుదల చేశారు. సాధారణ ఫార్మాట్లో తీసి ఆయా ఫార్మాట్లలోకి కన్వర్ట్ చేసి భారీగా విడుదల చేయడంతో వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు.
అయితే తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా అదిరిపోయే రీతిలో బ్రహ్మాస్త్రకు వసూళ్లు వచ్చాయి. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్, రూ.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. ఓవర్సీస్లోనూ తొలిరోజే 3 మిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. విజువల్గా మెప్పించిన ఈ మూవీ కంటెంట్ పరంగా నిరాశపరిచిందన్న రివ్యూలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా థియేటర్లకు తరలివెళ్తున్నారు. అమితాబ్, నాగార్జున, షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రల్లో ఈ సినిమాలో కనిపించడం హైలెట్గా నిలిచిందని చూసిన వాళ్లు చెప్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ముందుగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరు అనుకున్నారు. హీరో పేరు రూమీ అంటూ గతంలో ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెటింట్లో వైరల్ అయ్యాయి. ఇక పుల్వామా ఎటాక్ తర్వాత ఈ సినిమా పేరు ‘బ్రహ్మాస్త్ర’గా హీరో పేరును రూమీ కాస్త శివగా మార్చారు. ఫిబ్రవరి 2018లో ఈ మూవీ షూటింగ్ బల్గేరియాలో ప్రారంభమైంది. మార్చి 29, 2022న వారణాసిలో షూటింగ్ పూర్తయ్యింది.
బ్రహ్మాస్త్ర మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్గా నిలిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు సరిపోయేవాళ్లు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ మూవీలో జల అస్త్రం, అగ్ని అస్త్రం, వానరాస్త్రం, నంది అస్త్రం, బ్రహ్మాస్త్రం గురించి చూపించినట్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్కు ముందు బాయ్ కాట్ చేయాలన్న నిరసనలు కూడా వినిపించాయి. రణ్బీర్, ఆలియా గతంలో బీఫ్ తిన్నామన్న వీడియోలను వైరల్ చేస్తూ సినిమాను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. మూవీ రిలీజ్ సందర్భంగా ఉజ్జయిని వెళ్లగా అక్కడ కొందరు అయాన్ ముఖర్జీ, ఆలియా భట్, రణ్బీర్ కపూర్లకు వ్యతిరేకంగా నల్ల జెండాలు పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. బీఫ్ తినే వాళ్లను గుడిలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అయాన్ ముఖర్జీ ఒక్కరే దర్శనం చేసుకొని వెళ్లిపోయారు. కాగా బ్రహ్మాస్త్ర మూవీని దేశంలో సుమారు 5వేల స్క్రీన్లలో, విదేశాల్లో 3వేల స్క్రీన్లలో విడుదల చేశారు. వీకెండ్ వరకు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి ఫిలింనగర్ వర్గాల్లో కనిపిస్తోంది.