
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ కీలకమైనది. అందుకే ఈ సీజన్లో భారీ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒకేసారి మూడు, నాలుగు భారీ చిత్రాలు విడుదలైనా మంచి వసూళ్లు రాబడుతూ చిత్రసీమకు కళను తెచ్చిపెడతాయి. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా సంక్రాంతి సీజన్ బోసిపోయింది. నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ తప్ప మరో పెద్ద సినిమా విడుదల కాలేదు. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే వచ్చే సంక్రాంతి సీజన్ మాత్రం టాలీవుడ్కు మరోసారి మునుపటి కళను తెచ్చిపెట్టనుంది. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలతో పాటు కోలీవుడ్ అగ్రహీరో విజయ్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు.
మరోవైపు కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన వారసుడు మూవీ కూడా తెలుగులో పెద్దఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించడం, తెలుగులో సక్సెస్ శాతం ఎక్కువగా ఉన్న వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించడంతో వారసుడు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా జనవరి 12నే విడుదల కానుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 11 లేదా అంతకంటే ముందు జనవరి 7న విడుదల చేస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందనే వార్త ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. అందులోనూ ఒకేసారి రెండు భారీ సినిమాలను విడుదల చేయడం మంచిది కాదని మైత్రీ మూవీస్ వారికి పలువురు నిర్మాతలు సూచిస్తున్నారు. రెండు సినిమాలు పోటీ పడి వసూళ్లు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
మరోవైపు వారసుడు మూవీ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే అన్ని ప్రాంతాలను థియేటర్లను లాక్ చేశాడని.. దీంతో వాల్తేరు వీరయ్యకు సరైన స్థాయిలో థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొందని టాక్ నడుస్తోంది. దీంతో పోటీలో కాకుండా సంక్రాంతి తర్వాత సోలోగా విడుదల చేస్తే బజ్తో పాటు వసూళ్లు కూడా మంచిగా ఉంటాయని మైత్రీ సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా మెగాస్టార్ మూవీని వాయిదా వేయడం పక్కా అని తేలిపోయిందని.. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా అవతార్ 2 కోసం కొన్ని థియేటర్లు లాక్లో ఉండటం, వారసుడు, వీరసింహారెడ్డి మూవీస్కు మేజర్ థియేటర్లు బుక్ కావడం కూడా చిరు సినిమాను వాయిదా వేయడానికి ముఖ్య కారణాలుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా వాల్తేరు వీరయ్య మూవీని యంగ్ డైరెక్టర్ బాబీ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. చాలా కాలం తరువాత చిరంజీవి ఊరమాస్ అవతారం ఎత్తడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్త విని వాళ్లు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.