
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడే అయినా తమిళంలో స్థిరపడి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో అతడు. అయితే కోలీవుడ్తో సమానంగా టాలీవుడ్లోనూ విక్రమ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా విక్రమ్కు అన్ని భాషల్లోనూ స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. శంకర్ దర్శకత్వ ప్రతిభ, విక్రమ్ నటనలో వైవిధ్యం ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాయి. అయితే అపరిచితుడు సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతున్నా ఆ సినిమా తర్వాత విక్రమ్కు ఇప్పటివరకు నిఖార్సైన హిట్ దక్కలేదు. ఎన్ని వేషాలు వేసినా.. ఎన్ని సినిమాలు చేసినా మరో హిట్ కోసం అతడు పరితపిస్తూనే ఉన్నాడు. టాలెంట్ ఉన్న హీరో ఈ స్థాయిలో ఇన్నేళ్లు ఇబ్బందిపడటం సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు.
అయితే ఎట్టకేలకు విక్రమ్కు ఊరట విజయం దక్కినట్లు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. ఇటీవల కాలంలో విక్రమ్ సినిమాలన్నీ వరుసగా బోల్తా కొడుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్గానే మిగిలిపోయింది. కానీ తాజాగా విడుదలైన కోబ్రా మూవీ టాలీవుడ్లో ప్రాఫిట్ వెంచర్గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్కు వచ్చినట్లు తెలుస్తోంది. రూ.4 కోట్లకు కోబ్రా డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేయగా తొలి మూడు రోజుల్లోనే రూ.3.8 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వినాయకచవితి, వీకెండ్ హాలీడేస్తో పాటు ఇతర సినిమాలు పోటీ లేకపోవడంతో కోబ్రా సినిమాను ప్రేక్షకులు ఛాయిస్గా ఎంచుకుంటున్నట్లు ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. దీంతో చాలా కాలం తర్వాత టాలీవుడ్లో మరో డబ్బింగ్ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుందని భావిస్తున్నారు.
కోబ్రా సినిమాలో కూడా విక్రమ్ అనేక గెటప్పుల్లో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. విక్రమ్ కెరీర్లోనే ఈ మూవీ అత్యధిక ఓపెనింగ్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ బాగానే ఉన్నా, కథనం స్లోగా ఉందని, లెంగ్త్ బాగా ఎక్కువైందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దాంతో మేకర్స్ ఈ చిత్రాన్ని మరోసారి ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్లో ఈ చిత్రాన్ని దాదాపు 20 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు టాక్. ఇక ఎడిట్ వెర్షన్ గురువారం సాయంత్రం షోస్ నుండి అందుబాటులో ఉంది. ముందుగా ఈ చిత్రం 3 గంటల మూడు నిమిషాలు ఉండగా.. ఇప్పుడు 2 గంటల 43 నిమిషాలుగా ఉంది. ఈ మూవీలో విక్రమ్కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. మృనాళిని రవి ముఖ్య పాత్రలో నటించింది. ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టినట్లు పలు రివ్యూలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కాగా మూడేళ్ల తర్వాత విక్రమ్ నటించిన సినిమా తొలిసారిగా థియేటర్లలో విడుదలవ్వడం విశేషం.