
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పండగ సెలవులు ముగిసినా ఈ సినిమాకు వసూళ్ల ప్రభంజనం మాత్రం తగ్గడం లేదు. పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్తో వచ్చిన ఈ మూవీ నిజంగానే అభిమానుల్లో పూనకాలను తెప్పించింది. చాలాకాలం తర్వాత వింటేజ్ చిరంజీవి కనిపించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో విడుదలైన ఆరు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్కు చేరుకుంది. అంతేకాకుండా 2023లో దేశంలోనే తొలి హిట్ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. మాస్ మహారాజా రవితేజ గెస్ట్ రోల్లో కనిపించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. సాధారణంగా హిట్ టాక్ వచ్చిన సినిమాల వసూళ్లు వీక్ డేస్లో నెమ్మదిస్తాయి. ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాకే ఇలాంటి పరిస్థితి తప్పలేదు. కానీ వాల్తేరు వీరయ్య మూవీకి మాత్రం వీక్ డేస్లో కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పడుతుండటం విశేషం.
మొత్తంగా 10 రోజులకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.115 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో వీక్డేస్లో చాలా చోట్ల వాల్తేరు వీరయ్య మూవీ స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉండటంతో బయ్యర్లకు లాభాలను కురిపిస్తోంది. దీంతో బయ్యర్లు మరిన్ని థియేటర్లను పెంచుతున్నారు. ఉదాహరణకు విశాఖను తీసుకుంటే జగదాంబ కాంప్లెక్సులో జగదాంబలో వాల్తేరు వీరయ్య, శారద థియేటర్లో వీరసింహారెడ్డి, రమాదేవిలో ధమాకా సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయి. అయితే అభిమానుల డిమాండ్ దృష్ట్యా ఆదివారం మ్యాట్నీ షోకు పరిస్థితి మారిపోయింది. శారద థియేటర్లో వీరసింహారెడ్డి మూవీని తొలగించి వాల్తేరు వీరయ్యను ప్రదర్శించడంతో హౌస్ఫుల్ బోర్డు పడింది. ఇదే పరిస్థితి పలు చోట్ల నెలకొందంటూ మెగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అటు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వాల్తేరు వీరయ్యకు మంచి వసూళ్లు వస్తుండటంతో మరో థియేటర్ పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై తెరకెక్కిన ఈ మూవీకి బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించాడు. జై లవకుశ తర్వాత బాబీ తెరకెక్కించిన మూవీ ఇదే. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుంది. సంక్రాంతి పండగ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ క్రియేట్ చేసింది. నైజాం ప్రాంతంలో 10 రోజులకు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఈ సినిమాకు ఓవరాల్గా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటికే రూ.25 కోట్ల లాభాలను ఈ మూవీ అందుకుంది. మరో రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద వీరయ్య ప్రభంజనం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ మూవీ రూ.200 కోట్ల వసూళ్లను కూడా దాటనుంది. అటు గతంలో చిరంజీవి ఖైదీ నంబర్ 15, సైరా నరసింహారెడ్డి సినిమాలు ఓవర్సీస్లో 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తాజాగా 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసిన మూడో చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలవడం విశేషం.