
రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్. ఈ సినిమా గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అతడి సరసన కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఆమె ఈ మూవీలో రేడియో జాకీ పాత్రలో అభిమానులను అలరించింది. ఇప్పటికే విడుదలైన ది వారియర్ టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్గా నిలిచింది. ఈ మూవీ ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగిందని.. సెకండాఫ్ ఊరమాస్గా ఉందని చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. రామ్, ఆది పినిశెట్టిల మధ్య వచ్చే ఫైట్ సీన్లు, హోరాహొరీగా పోరాడే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.
ది వారియర్ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.73 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం సంస్థ కార్యాలయంలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. హీరో రామ్, విలన్ పాత్రధారి ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతీశెట్టి, దర్శకుడు లింగుస్వామి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి కేక్ కట్ చేశారు. వారియర్ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, లభిస్తున్న ఆదరణ పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.45 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వారియర్ మూవీ సేఫ్ జోన్లోకి వస్తుందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ ముగిసేసరికి రూ.25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగలగాలి. గురువారమే ఈ సినిమాను విడుదల చేయడం ప్లస్ పాయింట్గా నిలిచింది. దీంతో వీకెండ్ అయ్యేసరికి నాలుగు రోజుల వసూళ్లు ఈ సినిమా ఖాతాలోకి వస్తాయి. రామ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు.
కాగా ఈ సినిమాలో విలన్గా నటించిన ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. సరైనోడు సినిమా తర్వాత విలన్గా చేద్దామనప్పుడు అజ్ఞాతవాసి సినిమా చేశానని… అది పవన్ కళ్యాణ్ సినిమా కావడంతోనే ఆ మూవీని అంగీకరించినట్లు తెలిపాడు. ఆ మూవీ తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా…. దాని కంటే బెటర్గా ఉండాలని ఆలోచించానని చెప్పాడు. ది వారియర్ సినిమాలో తన రోల్ విన్నప్పుడు… ఆర్డనరీ విలన్గా కాకుండా, గురుకు ఒక క్యారెక్టరైజేషన్ ఉందని.. అది తనకు నచ్చడంతో అంగీకరించి చేశానని ఆది వివరించాడు. అయితే కథ విన్నప్పుడు తనకు కొన్ని డౌట్స్ వచ్చాయని.. రెండు రోజులు లింగుస్వామి గారితో మాట్లాడి చిన్న చిన్న సందేహాలు క్లియర్ చేసుకుని వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపాడు. గురు పాత్రకు ఫ్లాష్బ్యాక్ ఉండటంతో ప్రేక్షకుల అంత మాట్లాడుతున్నారని అనిపిస్తోందన్నాడు. ఈ సినిమా చూసి తనను తమిళ వాళ్ళు తెలుగు వాడిని అని.. తెలుగు వాళ్ళు తమిళోడిని అని భావిస్తున్నారని ఆది చెప్పాడు.