
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో రవితేజకు మరోసారి నిరాశ తప్పదంటూ బాక్సాఫీస్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. టాలీవుడ్ హీరోల్లో రవితేజకు ఓ ఇమేజ్ ఉంది. అతడి ఎనర్జీ లెవల్స్ ఓ రేంజ్లో ఉంటాయి. కామెడీ చేయడంలో తిరుగులేదు. తెరపై కనిపిస్తే చాలు … ప్రేక్షకులు ఎంటర్టైన్ అయిపోతారు. రవితేజ సినిమాకి టికెట్ తెగేది అందుకోసమే. ఇప్పటి వరకూ రవితేజ అలాంటి సినిమాలే చేశాడు. ముఖ్యంగా కిక్, రాజా ది గ్రేట్ సినిమాలు రవితేజకు మంచి విజయాలను అందించాయి. కానీ ఇటీవల రవితేజ మూస కథలను ఎంచుకుంటున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ కూడా అందులో భాగమే అని టాక్ నడుస్తోంది. ఖిలాడీ లాంటి డిజాస్టర్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇది. గతేడాది క్రాక్ మూవీతో బ్లాక్బ్లస్టర్ అందుకున్న రవితేజ ఖాతాలో రామారావు ఆన్ డ్యూటీతో మరో బ్లాక్ బ్లస్టర్ పడుతందని అందరూ ఆశించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.
అయితే రవితేజపై అభిమానంతో తొలి మూడు రోజుల పాటు సంతృప్తికర స్థాయిలోనే రామారావు ఆన్ డ్యూటీ మూవీ వసూళ్లను రాబట్టింది. వీకెండ్ వరకు వసూళ్లను లెక్కలోకి తీసుకుంటే రూ.7 కోట్ల షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఈ మూవీ వసూళ్లు డ్రాప్ అవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామారావు అన్ డ్యూటీకి హీరో రవితేజ సహ నిర్మాతగా వ్యవహరించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాంలో ఈ చిత్రం 5 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో రూ.7 కోట్ల మేర బిజినెస్ జరగడంతో రూ.15 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో డీల్ సెట్ అయింది. అటు కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో రూ.కోటి, ఓవర్సీస్లో 1.2 కోట్లు బిజినెస్తో మొత్తంగా 17.20 కోట్ల బిజినెస్ నమోదైంది. అయితే ఈ మొత్తం డబ్బులు తిరిగొచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు. ఎప్పుడూ హుషారుగా ఉండే రవితేజతో సీరియస్గా డ్యూటీ చేయించే మూవీ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. ఈ మూవీకి పేలవమైన స్క్రీన్ప్లే మైనస్గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్లో నేరేషన్ బాగా ఇబ్బంది పెడుతుందని అంటున్నారు.
కాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీకి తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, పలాస, నర్సన్నపేట ప్రాంతాల్లో కొన్ని షోలకు హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానరుపై నిర్మించారు. రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ , రజీషా విజయన్ నటించారు. ఈ మూవీలో ఒకనాటి హీరో వేణు తొట్టెంపూడి కూడా నటించాడు. ఈ సినిమాలో తొలిసారిగా తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు వేణు వెల్లడించాడు. ఇకపై తాను వరుసగా సినిమాలు చేస్తానని వేణు వివరించాడు. దమ్ము సినిమా తర్వాత వ్యాపారాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యానని పేర్కొన్నాడు. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అలాగే వెబ్ కంటెంట్పై కూడా దృష్టి పెట్టానని.. ఛాయ్ బిస్కెట్ నిర్మా ణంలో ఒక సినిమా చేస్తున్నానని వేణు తెలిపాడు. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉందన్నాడు.