
కలెక్షన్ కింగ్ మంచు మోహన్బాబు ప్రధాన పాత్ర పోషించిన సన్నాఫ్ ఇండియా మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 18న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రగ్యా జైశ్వాల్, మీనా, శ్రీకాంత్, సునీల్, బండ్ల గణేష్ వంటి నటులు ఈ సినిమాలో నటించారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన సినిమా థియేటర్లలో విడుదల కాగా అప్పట్లో ప్రేక్షకులు ఎవరూ పట్టించుకోలేదు. మోహన్బాబు లాంటి హీరో నటించిన ఈ మూవీకి అత్యంత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా వచ్చాయి. మల్టీప్లెక్స్లలో ఒకరు ఉన్నా.. ఇద్దరు ఉన్నా షో ప్రదర్శిస్తున్నారంటూ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక సింగిల్ స్క్రీన్లలో అయితే ప్రేక్షకులు లేకపోవడంతో చాలా షోలను థియేటర్ల నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్లు వేలు, లక్షల్లోనే ఉన్నాయంటే ఈ సినిమా పరిస్థితి గురించి అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. సాధారణంగా కొన్ని సినిమాలకు థియేటర్లలో ఫ్లాప్ టాక్ వచ్చినా ఓటీటీలలో హిట్ అవుతుంటాయి. మోహన్బాబు సన్నాఫ్ ఇండియా సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. ఓటీటీలో వస్తున్న స్పందన ఏ మాత్రం ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పట్టించుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఓటీటీ వేదికపై కూడా ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మోహన్ బాబు పరువు పోయిందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ముఖ్యంగా సన్నాఫ్ ఇండియా సినిమాపై వచ్చిన నెగిటివిటీ ఓటీటీ రిలీజ్పైనా కొంత ప్రతికూల ప్రభావం చూపించినట్లు టాక్ నడుస్తోంది. కోటి రూపాయల కంటే ఎక్కవ బడ్జెట్తో నిర్మితమైన సినిమాల్లో అమెజాన్ ప్రైమ్లో అతి తక్కువ వ్యూయర్ షిప్ వచ్చిన సినిమా ఇదేనని తెలుస్తోంది. ఆ రకంగా మోహన్బాబు రికార్డు సృష్టించారని కొందరు అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి ప్రచారం చేయకుండా మంచు కుటుంబం తమ పరువు నిలుపుకుందని ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే చాలాగ్యాప్ తర్వాత మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదలైన తొలిరోజు తొలి షోకే ఫలితం ఏంటో తేలిపోవడంతో ప్రజలు ఈ మూవీని చూసేందుకు ధైర్యం చేయలేకపోయారు. కాగా ఈ సినిమాలోని ఒక పాట కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశామని అప్పట్లో మోహన్ బాబు వెల్లడించాడు. అది కూడా ఈ సినిమాను కాపాడలేక పోయింది. పైగా ఆ పాటకు పెట్టిన మొత్తం కూడా సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది.