
టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ద సినిమాల హవా నడుస్తోంది. అఖండ, పుష్ప, రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, ఆచార్య సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే వీటిలో రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడ్డాయి. ముఖ్యంగా ఆచార్య సినిమా అయితే డిజాస్టర్ అనే చెప్పాలి. ఏప్రిల్ 29న రిలీజైన ఈ మూవీ మెగా అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. డివైడ్ టాక్ కాదు కదా.. ఈ సినిమా చూసిన వారిలో మెజార్టీ ఆడియన్స్ పెదవి విరిచారు. తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్స్లో చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ఆ అంచనాల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఈ మూవీలో చిరంజీవి బోర్ కొట్టడు కానీ, మూవీ స్టోరీ బోర్ కొడుతుంది. నక్సలిజం, అమ్మవారి మహత్యం, గిరిజన సంక్షేమం, ఆయుర్వేదం అన్నీ కిచిడీ చేసి వడ్డించారు. కానీ ఏదీ టేస్టుగా అనిపించలేదని అభిమానులు చెప్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వం వహించడం, చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించడంతో బయ్యర్లు భారీ ధరకు ఈ మూవీని కొనుగోలు చేశారు. దీంతో ఆచార్య మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 131 కోట్ల బిజినెస్ చేసింది. కాబట్టి ఆచార్య టార్గెట్ రూ. 150 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటివరకు ఆచార్య రూ.57 కోట్ల గ్రాస్, రూ.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఈ మూవీ రూ.107 కోట్ల బిజినెస్ రాబట్టింది. ఇంకా రూ.68 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్లో మరో రూ.2 కోట్లకు మినహా రాబట్టే అవకాశాలు కనిపించడం లేదు. అంటే బయ్యర్లకు భారీగా లాస్ వచ్చేలా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే రూ.80 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. కరోనా వల్ల ఈ మూవీ షూటింగ్ ఎంతో ఆలస్యమైంది. రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాము కేవలం వడ్డీల రూపంలోనే రూ.50 కోట్లు చెల్లించామని సినిమా ప్రమోషన్లలో చిరంజీవి స్వయంగా వెల్లడించాడు. అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికీ మొత్తంగా ఆ సినిమా మిలియన్ డాలర్లు కూడా వసూలు చేయలేకపోయింది.
టాలీవుడ్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ లాస్ వచ్చిన సినిమాల లిస్ట్లో రూ.90 కోట్లకు పైగా నష్టంతో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ తొలి స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, మహేష్బాబు నటించిన స్పైడర్, బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, సాహో, ఎన్టీఆర్ మహానాయకుడు, బ్రహ్మోత్సవం సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆచార్య కలెక్షన్లను చూస్తే.. ఈ మూవీకి రూ.80 కోట్ల నష్టాలు తప్పేలా లేవు. ఈ లెక్కన ఈ లిస్ట్లో ఆచార్య రెండో స్థానంలో నిలవనుంది. ప్రస్తుతం తొలివారంలోనే ఈ మూవీకి రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆచార్య మూవీని చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవితో పాటుగా రామ్ చరణ్, కొరటాల శివ కూడా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు. వీళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలంటే.. అమెజాన్ ప్రైమ్కు ముందుగానే సినిమాను ఇస్తే కనీసం రూ.10 కోట్లు అయినా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.