
ఇటీవల కాలంలో మంచు మోహన్బాబు కుటుంబంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత మంచు ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలపై నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు. దీంతో నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్గా మారుతూనే ఉంటుంది. ఎందుకంటే మోహన్బాబు, ఆయన కుమారులు నటించిన సినిమాలకు కనీస వసూళ్లు కూడా రావడం లేదు. ఇటీవల మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా దీనికి అతీతమేమీ కాదు. జిన్నా సినిమా టాలీవుడ్లో మరో పరాజయంగా మిగిలిపోయింది. ఆ సినిమా పట్టుమని కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. అటు ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఈ సినిమా విడుదలై దాదాపు 7 వారాలు గడుస్తున్నా ఇంకా ఓటీటీలోకి రాలేదు.
అయితే అంతలోనే మంచు కుటుంబంలో చిచ్చు చెలరేగింది. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు నెలకొన్నాయని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్, భూమా అఖిల ప్రియ సోదరి మౌనికను ప్రేమించడం, అది ఇష్టం లేని మోహన్ బాబు కుటుంబం పెళ్ళికి నిరాకరించడం.. దీంతో మనోజ్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం మనోజ్, మంచు కుటుంబం కనిపించే ఏ ఫంక్షన్లో కానీ, ఈవెంట్లో కానీ కనిపించలేదు. ఇవన్నీ పక్కన పెడితే.. మంచు సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయి అన్నది నిజమేనని, అందుకు ఓ వీడియోనే సాక్ష్యమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా అన్నకు బర్త్ డే విషెస్ ను మనోజ్ కొంచెం ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మహిళ జంబలకిడి జారు మిఠాయ అంటూ సాంగ్ పాడింది. ఆ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దాని మీద ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. చివరకు మనోజ్ సైతం ఆమెను కలిసి ఆమెతో అదే పాటను పాడించి విష్ణుకు బర్త్ డే విషెస్ చెప్పాడు. అన్న విష్ణు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా పాజిటివ్గా ఆలోచించాలని మరీ చెప్పుకొచ్చాడు.
దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మరోసారి మంచు కుటుంబాన్ని ఆడేసుకుంటున్నారు. సొంత అన్ననే తమ్ముడు ట్రోల్ చేస్తున్నాడని.. మిగతా వారు చేయడంలో తప్పేముంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరో విషయమేంటంటే.. ఈ వీడియోకు కానీ, తమ్ముడికి కానీ విష్ణు స్పందించకపోవకడం. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పిన విష్ణు తమ్ముడు మనోజ్ను మాత్రం పట్టించుకోకుండా వదిలేశాడు. దీంతో వీళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్ల క్రితం దాదాపు రూ. 28 కోట్ల బడ్జెట్తో విష్ణు హీరోగా ‘విష్ణు’ మూవీని నిర్మించారు. ఈ బడ్జెట్ అప్పటి వంద కోట్లకు సమానం. కానీ ఈ మూవీ డిజాస్టర్గా మిగిలింది. మంచు విష్ణు ఇచ్చిన షాక్తో మోహన్బాబు తన రెండో తనయుడు మనోజ్ను కూడా టాలీవుడ్లోకి దించారు. దొంగ దొంగది మూవీతో ఓ మోస్తరు ఫలితాన్ని మనోజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అన్నతో పోలిస్తే మనోజ్ బెటర్ అనే కామెంట్స్ వచ్చాయి. మనోజ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి చాలా కాలం అవుతోంది. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్తో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. లాక్ డౌన్కు ముందు ఈ మూవీ ప్రకటన రాగా రెండేళ్లు దాటిపోయినా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.