
టాలీవుడ్లో విలక్షణమైన నటుల్లో అడివి శేష్ కూడా ఒకడు. కెరీర్ ఆరంభంలో విలన్గా నటించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. గూఢచారి, క్షణం లాంటి సినిమాలు అడివి శేష్కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా అడివిశేష్ నటించిన మేజర్ సినిమా కూడా ఎంతో పేరును సంపాదించి పెట్టింది. 2011లో ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన పోరాట యోధుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అందుకే ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాను శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు. తొలి రోజే రూ.13.10 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. మహేష్బాబు లాంటి సూపర్స్టార్ ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడంతో హైప్ వచ్చింది. తొలిరోజు మహేష్ అభిమానులు కూడా ఎగబడి ఈ సినిమాను వీక్షించారు. అయితే వీకెండ్ తర్వాత మేజర్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం ఈ మూవీతో రిలీజైన కమల్ హాసన్ మూవీ విక్రమ్కు కూడా సూపర్ హిట్ టాక్ రావడమే. దీంతో విక్రమ్తో కలిసి వసూళ్లను మేజర్ పంచుకోవాల్సి వచ్చింది. అయినా మేజర్ సినిమా నిలకడగా వసూళ్లు సాధించడంతో లాభాల బాట పట్టింది. తొలి వారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.50.7 కోట్ల గ్రాస్.. రూ.25 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ మూవీ రూ.19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.35 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో బయ్యర్లకు రూ.16 కోట్లు లాభం వస్తుందని టాక్ నడుస్తోంది.
ఈ మేరకు హీరో అడివి శేష్ తాజాగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశాడు. మేజర్ సినిమా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అని రాసుకొచ్చాడు. తన గత సినిమాల కంటే మేజర్ మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశాడు. మేజర్ మూవీకి 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే వచ్చాయి. నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ.3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 38 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. నాని సినిమా అంటే సుందరానికీ మూవీకి డివైడ్ టాక్ రావడంతో రెండో వారం కూడా మేజర్ సంతృప్తికర వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు చిత్ర ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇటీవల బిగ్బీ అమితాబ్ కూడా స్పందించాడు. ముంబై 26/11 దాడుల్లో ఎంతో మంది ప్రజలను కాపాడి అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ చాలా బాగుందని ప్రశంసించడం విశేషం.