
సుడిగాలి సుధీర్ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ సుధీర్ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సుధీర్ కష్టపడి పైకొచ్చిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల గాలోడు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సుధీర్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా అవకాశాల కోసం తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ కార్యక్రమాన్ని సైతం సుధీర్ వదిలిపెట్టేశాడు. అటు ఈటీవీలో చాలా కార్యక్రమాలను కూడా సుధీర్ వదులుకున్నాడు. ఎట్టకేలకు గాలోడు సినిమాతో విజయం సాధించడంతో సుధీర్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నాడు. అయితే మళ్లీ టీవీ రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఢీ 15 డ్యాన్స్ షోలోకి సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కిరాక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఢీ కార్యక్రమం ఇప్పుడు మరో కొత్త సీజన్లోకి అడుగపెట్టబోతోంది.
వచ్చే ఆదివారం నుంచి ఢీ 15 కార్యక్రమానికి ఈటీవీ శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు ఆదివారం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ డ్యాన్స్ షో తెలుగులోనే కాదు సౌతిండియాలోనే అతిపెద్ద డ్యాన్స్ షో. ప్రతి బుధవారం ఢీ కార్యక్రమం టీవీలో ప్రసారమవుతుంది. ఇప్పటికే 14 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 15వ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ కార్యక్రమానికి టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగానే వస్తాయి. ఈ సీజన్లో టీం లీడర్గా సుడిగాలి సుధీర్ కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సుధీర్ గతంలో నాలుగు సీజన్లకు టీం లీడర్ గా వ్యవహరించాడు. డాన్స్ మధ్య లో ఆయన చేసే చిన్న కామెడీ స్కిట్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది.కానీ గత రెండు సీజన్స్లో సుధీర్ కనిపించలేదు. దీంతో సుధీర్ను బాగా మిస్ అవుతున్నాం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో మల్లెమాల టీమ్ సుధీర్ను ఒప్పించి ఢీ 15లోకి రీ ఎంట్రీ ఇప్పిస్తోంది. ఈ మేరకు మంచి ఆఫర్ కూడా అందజేస్తుందంటూ టాక్ నడుస్తోంది. సుధీర్తో పాటు రష్మీ, యాంకర్ ప్రదీప్ కూడా ఈ కార్యక్రమంలో ఉంటారని తెలుస్తోంది.
మరోవైపు సుధీర్ నటించిన గాలోడు సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకోవడంతో అతడికి వరుసగా ఆఫర్లు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. సుధీర్తో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు బడా నిర్మాతలు సుధీర్ డేట్స్ని బుక్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్కు చెందిన ఇద్దరు బడా నిర్మాతలు సుధీర్కు అడ్వాన్స్ ఇచ్చి మరీ డేట్లు లాక్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఉంటే మాత్రం సుడిగాలి సుధీర్ కెరీర్ మరో కీలక మలుపు తిరిగినట్లే. గాలోడు సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాలను కూడా అందుకుంది. సుధీర్ ఓ వైపు సినిమా అవకాశాలు అందుకుంటూనే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నాడు. ఓటీటీలో కామెడీ షోలోనూ సుధీర్ పాల్గొంటున్నాడు. బుల్లితెర మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న సుధీర్ వెండితెరపై కూడా వరుస విజయాలు సాధిస్తాడని అతడి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.