
తెలుగు సినిమా చరిత్రలో ప్రతి హీరో కెరీర్లో ఇండస్ట్రీ హిట్లతో పాటు బ్లాక్ బస్టర్ హిట్లు, అట్టర్ ఫ్లాపులు, డిజాస్టర్ మూవీస్ కూడా ఉంటాయి. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు, ఫైనాన్షియర్లకు భారీ నష్టాలు కూడా తెచ్చిపెడతాయి. అలా నష్టాలు తెచ్చిన సినిమాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన నిర్మాతలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. పలువురు నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ భారీ బడ్జెట్ను రెండు వారాల్లోనే తెచ్చుకునేలా ప్రభుత్వాలను అడిగి టిక్కెట్ రేట్లు పెంచుకునేలా చేసుకుంటున్నారు. అయినా కొన్ని సినిమాలు తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అలా ఇటీవల డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్తో పాటు చిరంజీవి నటించిన ఆచార్య ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు వచ్చిన నష్టాలు బయ్యర్లకు తీవ్ర నిరాశ కలిగించాయి.
ఇప్పటివరకు టాలీవుడ్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు మంచి వసూళ్లనే సాధించాయి. డిజాస్టర్లలో ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమా ఏదంటే ప్రభాస్ సాహో అనే చెప్పాలి. ఈ మూవీ రూ.222 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. రెండో స్థానంలో కూడా ప్రభాస్ సినిమానే ఉంది. రాధేశ్యామ్ సినిమాకు రూ.75 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ ఉంది. ఈ సినిమాకు రూ.60 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ జాబితాలో నాలుగో స్థానం కూడా పవన్ కళ్యాణ్ సినిమాదే. బాబీ దర్శకత్వం వహించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రూ.54 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇప్పుడు చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ఆచార్య ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చినా రూ.48 కోట్ల వసూళ్లు వచ్చాయి. అటు డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలలో మహేష్బాబు నటించిన స్పైడర్, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలతో పాటు ఎన్టీఆర్ నటించిన నరసింహుడు, ఆంధ్రావాలా మూవీస్ కూడా ఉన్నాయి.
అయితే ఆచార్య సినిమాకు వచ్చిన నష్టాల కారణంగా కర్ణాటకలోని ఓ డిస్ట్రిబ్యూటర్ మెగాస్టార్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశాడు. రాయ్చూర్ జిల్లాలో ఆచార్య మూవీ హక్కులను రాజ గోపాల్ బజాజ్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే పెట్టుబడిలో 25 శాతం మాత్రమే వచ్చిందని.. 75 శాతం నష్టపోవడంతో తనకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చిరును కోరాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడక పోవడం నాకు చాలా బాధగా ఉందని లేఖలో రాజగోపాల్ పేర్కొన్నాడు. తమ ప్రాంతంలో సినిమా విడుదల రైట్స్ కోసం తాను సినిమా విడుదలకు సంవత్సరం ముందే బుక్ చేసుకున్నానని.. సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకంతో కాకతీయ ఎగ్జిబిటర్స్ వారికి కూడా భారీ మొత్తాన్ని ప్రీమియం కింద చెల్లించినట్లు చెప్పుకొచ్చాడు. మెగా అభిమానుల నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశించానని.. కానీ అనుకున్న స్థాయిలో సినిమా ఆడట్లేదని.. సినిమా వల్ల చాలా నష్టాలకి గురైనట్లు వివరించాడు. తనకు నష్టపరిహారం ఇస్తే సమీప భవిష్యత్లో మరిన్ని సినిమాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, రెజీనా ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది.