
ప్రస్తుతం సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్తో పాటు చాలా మంది ట్విట్టర్ వాడుతున్నారు. గత మూడేళ్లుగా ట్విట్టర్ వాడే వారి సంఖ్య రెండింతలు పెరిగింది. మనలో చాలా మంది ట్విట్టర్ వాడుతున్నారు. న్యూస్, సినిమా అప్డేట్స్, ప్రముఖుల గురించి సమాచారంతో పాటు అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది ట్విట్టర్ చూస్తారు. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ట్విట్టర్ వాడేస్తున్నారు. సెలబ్రిటీలకు అయితే ట్విట్టర్లో ఫాలోవర్లు వేలల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్మస్క్ టేకోవర్ చేసుకోవడం దాదాపు ఖాయమైంది. ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించానంటూ మస్క్ చేసిన ట్వీట్తో మొదలై చివరకు వంద శాంతం వాటాను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే దాకా డ్రామా నడిచింది.
ట్విట్టర్ను అధికారికంగా మస్క్ తన ఆధీనంలోకి తీసుకున్నాక ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ను కొనసాగిస్తారా అన్న విషయమై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రస్తుత మేనేజ్మెంట్పై నమ్మకం, విశ్వాసం లేదని మస్క్ చెబుతున్నారు. మరోవైపు ఎలన్ మస్క్ తీసుకునే నిర్ణయాలు కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. ట్విట్టర్లో ఆయన సమూల మార్పులను తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అందరికీ ఉచితంగానే ట్విటర్ సర్వీసులు లభించేవి. రాబోయే రోజుల్లో మాత్రం ట్విట్టర్ చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైతే కేవలం కమర్షియల్, ప్రభుత్వ అకౌంట్ల విషయంలో ఫీజు వసూలు చేయాలని ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో అమల్లోకి తీసుకురానున్న ఫీజులు ఎంత మేర ఉంటాయనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. క్యాజువల్ యూజర్స్కి ట్విటర్ సేవలు ఉచితంగా ఉంటాయి. బహుశా ప్రభుత్వ, కమర్షియల్ యూజర్ల విషయంలో స్వల్పంగా ఫీజు వసూలు చేయవచ్చని ఎలన్ మస్క్ స్వయంగా వెల్లడించారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షుడి దగ్గరి నుంచి స్థానిక నేతల దాకా ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంబంధిత వ్యక్తులు.. ట్విట్టర్ ద్వారానే పోస్టులతో ప్రచారం చేస్తారు. మరోపక్క కంపెనీలు సైతం తమ ప్రకటనలకు సోషల్ మీడియాలను వేదికగా చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఫీజులు స్వల్పంగానే ఉంటాయని తెలుస్తోంది. కాగా ట్విట్టర్ను టేకోవర్ చేయడానికి ఎలన్మస్క్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆండ్రీసీన్ హోరోవిట్జ్ మద్దతుదారుగా నిలిచారు. 400 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు హోరోవిట్జ్ అంగీకరించారు. మరోవైపు ఎలన్మస్క్కు బాసటగా నిలిచేందుకు సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయడానికి ఒరాకిల్ గ్రూప్ కో ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్, స్కిక్యూయా క్యాపిటల్ 7.14 బిలియన్ల డాలర్లు సమకూర్చేందుకు సిద్దం అయ్యారని సమాచారం అందుతోంది. అంతేకాకుండా సౌదీ అరేబియాన్ ఇన్వెస్టర్ ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ కూడా ముందుకు వచ్చారు. తొలుత మస్క్ ప్రతిపాదనను వ్యతిరేకించినా తదుపరి 1.89 బిలియన్ల డాలర్ల విలువైన వాటా తీసుకోవడానికి అంగీకరించారు. ల్యారీ ఎల్లిసన్, స్కిక్యూయా క్యాపిటల్, సౌదీ అరేబియన్ ఇన్వెస్టర్ ప్రిన్స్ ప్రతిపాదనలతో ఎలన్మస్క్ తీసుకోనున్న రుణం 12.5 బిలియన్ల డాలర్ల నుంచి 6.25 బిలియన్ల డాలర్లకు తగ్గనుంది.