
మహేష్బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. అభిమానుల కోరిక మేరకు జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రీ రిలీజ్ చేయగా అదరగొట్టే రీతిలో వసూళ్లను సాధించింది. ఈ మూవీ రెండు రోజుల్లో రూ.1.90 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మొదటిరోజు ఈ సినిమా అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది. రెండు కోట్ల పది లక్షల గ్రాస్ను రాబట్టింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఒక్కడు సినిమా 95 లక్షల గ్రాస్ను రాబట్టింది. సీడెడ్లో 20 లక్షలు, ఆంధ్రాలో 80 లక్షల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో 15 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇటీవల రీ రిలీజ్ సినిమాలతో పోల్చుకుంటే ఒక్కడు సినిమా వెనుకబడిందనే చెప్పాలి. రీ రిలీజ్ వసూళ్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఖుషి, జల్సా సినిమాలు టాప్లో నిలిచాయి. ఖుషి సినిమా తొలిరోజు రూ.3.65 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
రీ రిలీజ్ సినిమాల జాబితాలో ఖుషి అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలోనూ పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది. జల్సా మూవీ తొలిరోజు రూ.2.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత ఒక్కడు నిలిచినట్లు ట్రేడ్ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఓవరాల్గా ఒక్కడు మూవీ తొలిరోజు రూ.2.10 కోట్ల గ్రాస్, రూ.95 లక్షల షేర్ రాబట్టగా రెండో రోజు సుమారుగా 60 లక్షల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఒక్కడు సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. భూమిక హీరోయిన్గా నటించింది. 2003లో రిలీజైన ఒక్కడు 8 నంది అవార్డులను సొంతం చేసుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నలభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఒక్కడు మూవీ మోడరన్ క్లాసిక్లా టాలీవుడ్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది.
అటు ఉత్తరాంధ్రలో ఇటీవల రీ రిలీజ్ చేసిన సినిమాల విషయంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒక్కడు మూవీ ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ జాబితాలో ఖుషి, జల్సా, పోకిరి, బిల్లా తొలి నాలుగు స్థానాల్లో్ ఉండగా ఒక్కడు మూవీ మాత్రం ఐదో స్థానంలో నిలిచింది. నైజాం తరహాలో ఉత్తరాంధ్రలో ఒక్కడు సినిమాను అభిమానులు సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. ఈ మూవీ విశాఖ సిటీలో తొలిరోజు నాలుగు థియేటర్లు, కొన్ని మల్టీప్లెక్సుల్లో విడుదలైంది. లీలామహల్, ఎస్వీసీ గోకుల్, కామేశ్వరి, శారద థియేటర్లలో ఒక్కడు సినిమాను ప్రదర్శించారు. అటు నైజాం ప్రాంతంలోని హైదరాబాద్కు గుండెకాయలా నిలిచే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏకంగా నాలుగు థియేటర్లలో ఒక్కడు మూవీని ప్రదర్శించారు. దేవి, సుదర్శన్, సంధ్య 35, శాంతి థియేటర్లలో ఒక్కడు మూవీ స్పెషల్ షోలు వేయగా తొలిరోజు దాదాపు అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న చాలా మంది యంగ్ మహేష్ అభిమానులు ఒక్కడు సినిమాని థియేటర్లలో చూసి ఉండరు. ఆ మాస్ హిస్టీరియాను కుర్ర అభిమానులు థియేటర్లలో చూసేందుకు తాజాగా క్యూ కట్టడం జరిగింది.