
టాలీవుడ్ పెద్ద సినిమాల హవా కొనసాగుతోంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య మూవీ కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మెగా పవర్స్టార్ రామ్చరణ్ నటించిన మూవీ కావడం, సైరా తర్వాత మెగాస్టార్ నటించిన మూవీ కావడం, కొరటాల శివ దర్శకత్వం వహించడం కూడా ఈ మూవీపై హైప్ ఏర్పడింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. చిరు కెరీర్లోనే ఈ అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా ఆచార్య రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి శుక్రవారం రోజు మార్నింగ్ షో లతో సందడి మొదలు పెట్టింది. అయితే అంచనాల మేరకు ఈ సినిమా లేదనే టాక్ వచ్చింది. మొత్తంగా చూస్తే డివైడ్ టాక్ వచ్చింది.
డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు తొలిరోజు అదిరిపోయే రీతిలో కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. మాస్లో మంచి హైప్ ఉండటంతో ఏపీ, తెలంగాణ కలిపి తొలిరోజు ఆచార్య మూవీకి రూ.32 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ.45 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీమియర్స్ రూపంలో అమెరికాలో ఒక రోజు ముందుగానే విడుదలైంది. దీంతో చిరు సినిమాల్లో రిలీజ్కు ముందే భారీ మొత్తంలో కలెక్షన్లను రాబట్టి అక్కడ రికార్డు సృష్టించింది. యూఎస్లో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారా 500 లక్షల డాలర్లపైగా వసూలు చేసిందని అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రైమ్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అమెరికాలో ఆచార్య సినిమా 400కు పైగా థియేటర్లలో విడుదలైంది. అంతేకాకుండా 3,200కు పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసినట్టు ప్రైమ్ మీడియా చెప్పింది.
ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి కమర్షియల్ సినిమా రాకపోవడంతో ఆచార్యపై అంచనాలు మరింత పెరిగాయి. పూజా హెగ్డే గ్లామర్, మణిశర్మ సంగీతం కూడా ఈ సినిమాకు మరింత హైప్ను తీసుకువచ్చింది. అయితే ఇప్సటివరకు టాలీవుడ్లో అపజయం లేని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను సరిగ్గా డీల్ చేయలేదని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కొరటాల నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదని ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరైతే బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని.. రాజమౌళి సినిమా తర్వాత రామ్చరణ్కు ఫ్లాప్ రాక ఇంకే వస్తుందని.. ఐరన్ లెగ్ పూజా హెగ్డే ఉంటే మూవీ ఆడదని.. ఆమె ఇటీవల నటించిన రాధేశ్యామ్, బీస్ట్ సినిమాల ఫలితాలు చూశాక ఆచార్య హిట్ అవుతుందని ఎలా అనుకుంటామని మెగా అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుందని.. ఫైట్ సన్నివేశాలు, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్గా నిలిచాయని చెబుతున్నారు. అయితే సినిమాలో కొంత సాగదీత ఉందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.