
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత నటించిన మూవీ ఆచార్య. ఈ చిత్రంలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. గతంలోనూ తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ అది ఐదు లేదా పది నిమిషాలు మాత్రమే. మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరు, చరణ్ కలిసి కనిపించారు. కానీ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నాడు. దాంతో ఆచార్య మల్టీస్టారర్ సినిమా అనే చెప్పాలి. తండ్రీ కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఏపీ, తెలంగాణలో తొలిరోజు ఆచార్య మూవీకి రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లను పరిగణనలోకి తీసుకుంటే రూ.45 కోట్ల వసూళ్లు రాబట్టింది.
అయితే పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ రెండు నెలల కిందట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ తొలిరోజు ఏపీలో తక్కువ టిక్కెట్ రేట్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. కానీ ఆచార్య మాత్రం భీమ్లా నాయక్ను అధిగమించింది. ఆచార్య మూవీకి రూ.45 కోట్లు రావడంతో తమ్ముడి సినిమాను అన్నయ్య క్రాస్ చేసినట్లయ్యింది. సాధారణంగా చిరంజీవి ఒక్కడు ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటిది ఇప్పుడు ఆయనకు రామ్ చరణ్ కూడా తోడయ్యాడు. దాంతో ఆచార్య ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అందులోనూ ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత రామ్చరణ్ నటించిన మూవీ కాబట్టి మెగా అభిమానులు ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెట్టుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో తొలిరోజు ఏకంగా రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆర్.ఆర్.ఆర్తో పోలిస్తే ఆచార్య చాలా వెనుకే ఉన్నాడు. ఇటీవల విడుదలైన కన్నడ డబ్బింగ్ కేజీఎఫ్-2 కూడా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు దుమ్మురేపింది. ఈ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.19 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇటీవల తెలుగులె వరుసగా పాన్ ఇండియా సినిమాలు చూసిన కళ్లతో ఆచార్య మూవీ పోటీ పడగలదా అనే అనుమానాలు కూడా అందరిలోనూ ఉన్నాయి. కానీ దర్శకుడు కొరటాల శివ ట్రాక్ రికార్డు.. చిరంజీవి మాస్ ఇమేజ్.. రామ్ చరణ్ అప్పియరెన్స్ అన్నీ కలిసి కచ్చితంగా ఆచార్యకు రికార్డు ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. డివైడ్ టాక్ వస్తేనే రూ.45 కోట్ల వసూళ్లు సాధించిన ఆచార్య.. అదే పాజిటివ్ టాక్ వచ్చుంటే ఈ వసూళ్లు మరింత పెరిగి ఉండేవి. అయితే శని, ఆదివారాల్లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే విషయంపైనే ఈ మూవీ సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంది. పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూర్చాడు. కాజల్ సన్నివేశాలు ఈ సినిమాలో డిలీట్ చేసినా ఆమెకు రెమ్యునరేషన్ ఇచ్చారని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది.