
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ రెండో వారంలోకి ప్రవేశించింది. అయితే రెండో వారంలో దాదాపు 90 శాతం థియేటర్లు ఈ సినిమాను తొలగించాయి. పెద్ద సెంటర్లలో మాత్రమే రెండో వారం ఈ మూవీని నడిపిస్తున్నారు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ మూవీకి రూ. 131.20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా అందులో సగం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. మెగా మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ మూవీ బయ్యర్లకు భారీగా నష్టాలను మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా తొలివారం రూ.48 కోట్లను మాత్రమే రాబట్టింది. దీంతో దాదాపు రూ.85 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రియల్ హీరో సోనూసూద్ విలన్ పాత్రలో కనిపించాడు.
ముఖ్యంగా ఆచార్య మూవీ పరాజయం దర్శకుడు కొరటాల శివను మానసికంగా బాగా కుంగదీసింది. హిట్లు, సూపర్హిట్లు కాకుండా నాలుగు బ్లాక్బస్టర్లు తీసిన కొరటాల శివేనా ఈ సినిమా తీసింది అంటూ సినీ ప్రేమికులంతా ఆశ్చర్యపోయారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో అంటూ సినీ విశ్లేషకులు పోస్టు మార్టం చేయడం ప్రారంభించారు. అయితే వాస్తవానికి ఈ సినిమా రామ్చరణ్తో చేయాల్సిందని.. కానీ అతడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కమిట్ కావడంతో కొరటాల శివ మెగాస్టార్ను లైన్లోకి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడే సినిమాకు దర్శకుడు ఒప్పుకోవాలి. కానీ ఆచార్య విషయంలో అక్కడే తప్పు జరిగిందని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ సీన్లోకి రావడంతో బౌండెడ్ స్క్రిప్ట్తో కాకుండా కొరటాల శివ ఏదో మూడు, నాలుగు లైన్ల కథను చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది.
అంతేకాకుండా ఆచార్య కోసం కొరటాల శివ రాసుకున్న స్క్రిప్ట్లో చిరంజీవి, రామ్చరణ్ జోక్యం ఎక్కువగా ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దర్శకుడిగా స్క్రిప్టుపై పూర్తిగా పట్టు సాధించకుండానే ఆచార్య షూటింగ్ ప్రారంభమైందని.. అందుకే ఈ విషయం ఈ సినిమా పరాజయానికి కారణమైందని తెలుస్తోంది. కాగా ఈ మూవీ బిజినెస్ దాదాపు క్లోజ్ అయినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎనిమిది రోజులకు ఈ మూవీ రాబట్టిన కలెక్షన్లను చూస్తే మొత్తం రూ. 40.53 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకతో పాటు ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.75 కోట్లు, ఓవర్సీస్లో రూ. 4.72 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల షేర్, రూ. 75.35 కోట్లు గ్రాస్ రాబట్టింది. తొలివారం ముగిసిన తర్వాత అంటే.. 8వ రోజు కలెక్షన్లను గమనిస్తే.. నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో లక్ష లోపు, తూర్పు గోదావరిలో లక్ష లోపు, పశ్చిమ గోదావరిలో లక్ష రూపాయలు, గుంటూరు లక్ష లోపు, కృష్ణాలో లక్ష రూపాయలు, నెల్లూరులో లక్ష లోపు కలెక్షన్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.