
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపు 152 సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు కూడా ఉన్నాయి. అయితే లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా మాత్రం చాలా విరామం తర్వాత వచ్చింది. కరోనా కారణంగా ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలకు అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ నడుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి బోర్ కొట్టడు కానీ, ఆచార్య బోర్ కొడుతుంది. నక్సలిజం, అమ్మవారి మహత్యం, గిరిజన సంక్షేమం, ఆయుర్వేదం అన్నీ ఉగాది పచ్చడిలా కలిపి వడ్డించారు. దీంతో ఏదీ టేస్టుగా అనిపించలేదు. ఈ ఉగాది పచ్చడి నాలుక రుచికే తప్ప ఆకలి తీర్చడానికి కాదని తేలిపోయింది. అటు ఆచార్య మూవీకి వస్తున్న టాక్తో మెగాస్టార్ కూడా నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఆచార్య సినిమాలో మెగాస్టార్కు హీరోయిన్ లేకపోవడం, మునుపటిలా ఆయన డ్యాన్స్లు లేకపోవడం అభిమానులకు నచ్చేలేదని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో చిరంజీవి, రామ్చరణ్ ఇద్దరూ చేసేది ఊరి సంరక్షణే. కనీసం వేర్వేరు కథలైనా కొంచెం ఆసక్తి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. విలన్ మనుషుల్ని ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో కొట్టే సినిమాల్ని చాలా చూసేశాం. కథలో ఏదో కీ పాయింట్ మిస్ అయ్యింది. పూజాహెగ్డే పాత్ర ఎందుకుందో అర్థం కాదు.. పూజా పాత్ర ఇటీవల వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఆలియాభట్ క్యారెక్టర్లా ఉందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ధర్మస్థలి సెట్ గురించి మొదటి నుంచి చాలా గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ ఆ సెట్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. భారీ తనం సంగతి అటుంచితే సహజత్వం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. ఇది సెట్ అనే విషయం తెలిసిపోయేలా ఉందని.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వీకెండ్ నాటికి ఏ స్థాయిలో వసూలు చేస్తుందనేది చూడాలి.
ఆచార్య లాంటి కథలను మున్ముందు అంగీకరించే ప్రసక్తే లేదని చిరంజీవి తన సన్నిహితులతో చెప్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆచార్య లాంటి తప్సును మళ్లీ చేయనని ఆయన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి తరువాతి చిత్రం భోళాశంకర్. ఈ మూవీ తర్వాత గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు కూడా వరుసగా ఉన్నాయి. గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమాలు అయితే ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అంతేకాకుండా వీటితో పాటు బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమాను కూడా చిరంజీవి చేస్తున్నాడు. మెగాస్టార్ 154 సినిమాగా ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాల్లో చిరు నటన అనేది ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే దర్శకుల బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేమీ కాదు. మెహర్ రమేష్, బాబీ అంత ఫామ్లో లేరు. మెహర్ రమేష్కు అయితే టాలీవుడ్లో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. కంత్రి, శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఉన్నాయి.